Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఫాదర్‌ ఆప్‌ లోక్‌సభ మౌలాంకర్‌

gv_mavalankarఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
అన్నాడు మహాకవి శ్రీశ్రీ మన ఇరుగుపొరుగు దేశాల విషయంలో... మనతోపా టు కొంచెం అటూ.. ఇటు గా స్వాతంత్య్రం పొందిన దే శాల్లో ఇది నిజమైతే కావ చ్చు కానీ, స్వంతంత్య్ర భార త చరిత్రలో... ‘నియంత’ ఇందిర సాగించిన ఆ 18 మాసాల (ఎమర్జెన్సీ) ని యంతృత్వ పాలనను మినహాయిస్తే... పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రణవిల్లింది. అందుకే ప్రపంచ దేశాలలో మనదేశానికి ప్రత్యేక స్థానం లభించింది. స్వాతంత్య్ర పోరాటంలో స్వయంగా పాలుపంచుకున్న ఎందరో మహనీయులు... నాటిన ప్రజాస్వామ్య బీజాలే ప్రధాన కారణం. అలాంటి మహనీయుల్లో లోక్‌సభ తొలి స్పీకర్‌ మౌలాంకర్‌ ఒకరు. ఆయన 1956 ఫిబ్రవరి 27న కన్నుమూశారు. ఈ మాసాన్ని మరువలేని మా సంగా చేశారు.


Balvantrai-Thakore,Sardar-Pచెరగని ముద్ర:
స్వతంత్ర భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై చెరగని ముద్ర వేసింది ఎవరని ఎవరిని అడిగినా... తడుముకోకుండా వచ్చే సమాధానం మౌలాంకర్‌ పేరే. అందులో సందేహం లేదు. ఎవరిదాకానో ఎందుకు భారత తొలిప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ... మౌలాంకర్‌ను ‘ఫాదర్‌ ఆఫ్‌ ది లోక్‌సభ’ అని కీర్తించారు. దాస్యశృంఖలాలు తెంచుకొని అప్పుడే పుట్టిన ‘స్వతంత్ర’ దేశానికి ప్రథమ స్పీకర్‌గా ఆయన పోషించిన పాత్ర, సభను సజావుగా నడిపించడం వరకే పరిమితం కాలేదు. భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా, దేశ సంస్కృతులు, సంప్రదాయాలు, విలువలు మేళవించేలా పార్లమెంట్‌ నియమ నిబంధనలు, సంప్రదాయాలు తదితరాలన్నింటినీ రూపొందించిన రాజనీతిజ్ఞుడు మౌలాంకర్‌. ఆయన చారిత్రక నేపథ్యాన్ని ఎంతో విజ్ఞత, వివేకంతో ప్రదర్శించారు కాబట్టే, ఆయనను ఆనాటి రాజకీయ నేతలందరూ రాజకీయ విబేధాలను విస్మరించి ‘మోడల్‌ స్పీకర్‌’ - ‘ఆదర్శ సభాపతి’గా కీర్తించారు.

ఆదినుంచీ కాంగ్రెస్‌ వాది:
దాదాసాహెబ్‌ మౌలాంకర్‌, జి.వి.మౌలాంకర్‌గా ప్రసిద్ధి చెం దిన గణేష్‌ వాసుదేవ మౌలాంకర్‌ 1888 నవంబర్‌ 27వ తేదీన ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలోని బరోడాలో జన్మించారు. 1908లో అహ్మదాబాద్‌లోని ‘గుజరాత్‌ కాలేజీ’ నుంచి బి.ఏ. (సైన్స్‌) పట్టా పొందారు. 1912 లో లా డిగ్రీ ఫస్ట్‌ క్లాసు లో పాసయ్యారు. 1913లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అదే సమయంలో అనేక సంస్థల ద్వారా సామూహిక సేవా కార్యక్రమా ల్లో చురుకైన పాత్రను పోషించారు. అలాగే చిన్నతనం నుంచి భార త జాతీయ కాంగ్రెస్‌ (ఇందిరా కాంగ్రెస్‌ కాదు) లో తద్వారా స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. 1930 -40 దశకంలో ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేకమార్లు జైలుకెళ్లారు. మొత్తంగా చూస్తే ఆయన ఆరు సంవత్సరాల జైలు జీవితం గడిపారు. ఆయనకు ఆది నుంచి అధికార వికేంద్రీకరణ, పటిష్ట పంచాయితీ రాజ్‌ వ్యవస్థల కోసం కృషి చేశారు. సుమారు రెండు దశాబ్దాల పాటు అహ్మదాబాద్‌ పురపాలక సంఘం వ్యవహారాల్లో కీలక భూమికను పోషించారు.

Lok-Sabha-Speaker-G-V-Mavalఆయన ఎన్నికల రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైంది. రెండుసార్లు పురపాలక సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. స్థానిక స్వపరిపాలన లక్ష్యంగా ఆయన జీవితాంతం పనిచేశారు. విద్య, సాహిత్యం పట్ల కూడా ఆయన విశేష మక్కువ చూపారు. గుజరాతీ, ఇంగ్లీ షు భాషలలో ఆయన రాసిన గ్రంథాలు భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచాయి.

నేరుగా అధ్యక్ష పీఠానికి:
మౌలాంకర్‌ 1937లో తొలిసారిగా ఆనాటి బాంబే శాసనస భకు అహ్మదాబాద్‌ సిటీ నుంచి ఎన్నికయ్యారు. ఇక్కడో విశేషం... సహజంగా ఎంతో అనుభవం ఉన్నవారినే స్పీకర్‌ పదవికి అర్హులని భావిస్తారు. కానీ, తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన మౌలాంకర్‌ నేరుగా అధ్యక్షస్థానాన్ని అలంకరించారు. 1946 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇదొక విశేష గౌరవం. అలాగే 1946లో ఆయన జాతీయ స్థాయి లోనూ అదేవిధమైన గౌరవాన్ని పొందారు. సెంట్రల్‌ లెజిస్లేచర్‌ అసెంబ్లీకి ఎన్నికైన తొలిసారే... అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు. ఆయన ఆ పదవిలో 1947 ఆగస్టు 14-15 అర్థరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు కొనసాగారు.

కీలక ఘట్టంలో:
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగ నిర్మాణ సభకు సమాంతరంగా చట్టసభల నిర్మాణ వ్యవహారాలపై నియమనిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాణ సభ (చట్టసభల వ్యవహారాలు) కు సహజంగానే అధ్య క్ష బాధ్యతలు నిర్వహించారు. అదే క్రమంలో 1949 నవంబర్‌ 29 ప్రొవిజనల్‌ పార్లమెంట్‌కు స్పీకరయ్యారు. 1952లో తొలి లోక్‌సభ ఏర్పడే వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. అఫ్‌కోర్స్‌, తరువాత తొలి లోకసభకు ఆయనే స్పీకర్‌. నిజానికి ఇదే దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో అత్యంత కీలకమైన కాలం. ఈ కీలక ఘట్టంలో అత్యంత కీలక భూమికను పోషించిన ‘స్పీకర్‌’ మౌలాంకర్‌.

parlimentప్రథమ స్పీకర్‌గా:
స్వాతంత్య్రం సిద్ధించిన భారతదేశం సర్వసత్తాక దేశంగా ప్రజాస్వామ్య, లౌకికవాద దేశంగా అవతరించిన అనంతరం ప్రారంభమైన సూతన శకాని కి శ్రీకారం చుట్టిన ప్రముఖులలో మౌలాంకర్‌ ఒకరు. పార్లమెంట్‌ సక్రమంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అనేక సత్‌ సంప్రదాయాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అందుకే తొలి లోక్‌సభ కొలువుదీరిన సమయంలో ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్పీకర్‌ పదవికి మౌలాంకర్‌ పేరును ప్రతిపాదించినప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు. 1952 మే 15వ తేదీన తొలి లోక్‌సభ ప్రథమ స్పీకర్‌గా మౌలాంకర్‌ పేరు నెహ్రూ ప్రతిపాదించగా... సభలో 394 మంది సభ్యులు ఆ ప్రతిపాదనను సమర్థించారు. కేవలం 55 మంది మాత్రమే ప్రతిపాదనను వ్యతిరేకించారు.

సభ్యులు, దేశ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసాన్ని మౌలాంకర్‌ వమ్ముచేయలేదు. రాష్టప్రతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం - దానిపై చర్చ, పార్లమెంట్‌ కమిటీల ఏర్పాటు, ప్రశ్నోత్తరాల సమయం, లఘు చర్చ లాంటి ఈనాటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రదమైన నూతన సంప్రదాయాలకు మౌలాంకర్‌ శ్రీకారం చుట్టారు. అలాగే మౌలాంకర్‌ ఇచ్చిన అనేక రూలింగ్స్‌కు - ఇతర చట్టసభల కూ ఈ నాటికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. 1946-1956 వరకు మౌలాంకర్‌ పార్లమెంట్‌ చర్చలు నిష్పక్షపాతంగా, ప్రతిష్టాత్మకంగా కొనసాగించడంలో ఆయన చూపిన రాజనీతిజ్ఞత ఈనాటికే కాదు ఎప్పటికీ కూడా మరువలేనిది. అందుకే పండిట్‌ నెహ్రూ ఆయనను ‘ఫాదర్‌ ఆఫ్‌ లోక్‌సభ’ అన్నారు. విపక్షాలు ఆయనను ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయన ఓ ప్రవక్త’ అని అభివర్ణించాయి. ప్రతిపక్షాల హక్కుల పరిరక్షకునిగానూ ప్రతి పక్షాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన ఈనాటికే కాదు ఎనాటికీ మరువలేని మహనీయుల్లో ఒకరుగా నిలిచారు.

ఫిబ్రవరి మాసానికే కాదు... ప్రజాస్వామ్య ప్రస్థానం సాగినంత కాలం మౌలాంకర్‌ మరువలేని మహా మనీషి...

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement461
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us