భర్త నెల జీతం ఎంతా అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ ఓ మహిళకు తన జీవితంలో ఓ భిన్నమైన పరిస్థితి ఎదురైంది. నెలకు ఎంత జీతం వస్తుందో భర్త.. తన భార్యకు చెప్పలేదు. దాంతో ఆవిడ ఏం చేసిందో తెలుసా..? తెలిస్తే అవాక్కవుతారు. తన భర్త జీత భత్యాల గురించి తెలుసుకునేందుకు ఏకంగా ఆర్టీఐకు దరఖాస్తు చేసుకుంది. ఈ అరుదైన సంఘటన ఢిల్లీలో జరిగింది. సంజు గుప్తా అనే మహిళ ఇటీవల తన భర్త ఆదాయ వివరాలను కోరుతూ ఆర్టీఐకు దరఖాస్తు చేసుకుంది. ఆమె భర్త ఎప్పుడూ తన జీతం గురించి సరిగ్గా చెప్పలేదని, తనకు ఆదాయ వివరాలు స్పష్టంగా కావాలని అప్లికేషన్లో పేర్కొంది.
అయితే సంజు గుప్తా దరఖాస్తు చేసుకున్నప్పటికీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం అధికారులు ఆ వివరాలు తెలియజేయడానికి నిరాకరించాయి. సంజు భర్త అంగీకరించకపోవడంతోనే సంబంధిత అధికారులు జీతం వివరాలు అందించలేదు. అయినా సంజు గుప్తా ఆగలేదు. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ నుంచి సాయం కోరింది. దాంతో కేంద్ర సమాచార కమిషన్... 15 రోజుల్లోగా ఆమెకు తన భర్త ఆదాయం, స్థూల ఆదాయం వివరాలను తెలియజేయాలని సీపీఐఓని ఆదేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల గత ఆదేశాలు, తీర్పులను పరిశీలించి సెప్టెంబర్ 19, 2022న తన ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తానికి సంజుగుప్తా పట్టుబట్టి సాధించారు. ఇంతకీ సంజు గుప్తా తన భర్త జీతం వివరాలను ఇలా ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది తెలియలేదు. వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలావుంటే భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తి, విడాకులు పరస్పరం అంగీకారంతో జరగనప్పుడు.. భార్య తన భర్త నుంచి ఆదాయ వివరాలను కోరవచ్చు. భరణం కూడా డిమాండ్ చేయవచ్చు. ఆదాయ వివరాలను వెల్లడించడానికి భర్త నిరాకరిస్తే... భార్య ఇతర మార్గాల ద్వారా యాక్సెస్ పొందవచ్చు. ముఖ్యంగా ఇలా ఆర్టీఐ ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తానికి ఢిల్లీకి చెందిన సంజు గుప్తా ఇలా కొత్త మార్గంలో తన భర్త ఆదాయం వివరాలను తెలుసుకుని.. వార్తల్లో నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa