భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పర్యటనల ఖర్చుపై దేశంలోని ఇతర పార్టీలు పలు మార్లు విమర్శలు గుప్పించిన విషయం లిసిందే. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీ గత ఐదేళ్ల కాలంలో వివిధ దేశాల్లో పర్యటనల కోసం ప్రభుత్వం రూ. 239 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో మోదీ విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్లలో ప్రధాని మొత్తం 36 విదేశీ పర్యటనలు చేశారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పీన్స్ లో పర్యటించారు.
2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీ పర్యటనలు చేశారు. 2019 సెప్టెంబర్ 21 నుంచి 28 తేదీల్లో మోదీ చేసిన అమెరికా పర్యటన కోసం అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్ 26-28వ తేదీల్లో జపాన్ పర్యటనకు అత్యల్పంగా రూ.23లక్షలు ఖర్చయినట్లు పేర్కొంది. కాగా, వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించడమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ చెప్పారు. దేశ ప్రయోజనాలతోపాటు విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa