తెలుగు వారి సత్తా ఢిల్లీకి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఇదిలావుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన 100వ జయంతి సందర్భంగా పలువురు శద్ధాంజలి ఘటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున ట్వీట్టర్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
"చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది.
ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగంల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా తరఫున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను." అని పవన్ పేర్కొన్నారు.
.ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న ఎన్టీఆర్ ఘాట్లో ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. వేర్వేరుగా వచ్చిన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్.. పుష్పగుచ్చాలు ఉంచి నివాళలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడని బాలకృష్ణ.. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa