ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తకు విడాకులిచ్చిన పొలండ్ మహిళ,,ఝార్ఖండ్‌లోని ప్రియుడితో త్వరలో పెళ్లి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:07 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రేమలు సరిహద్దులు దాటి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నాయి. పబ్‌జీలో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు చెందిన మహిళ తన నలుగురు పిల్లలను తీసుకుని భారత్‌కు వచ్చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ పోలండ్ మహిళ తన కుమార్తెను తీసుకుని భారత్‌కు వచ్చేసింది. పోలండ్‌కు చెందిన పోలాక్‌ బార్బరా (45) అనే మహిళలకు ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదాబ్‌ (35)తో రెండేళ్ల కిందట ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైంది.


ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇప్పటికే పోలాక్‌కు వివాహం కాగా... ఆరేళ్ల కుమార్తె ఉంది. దీంతో భర్తకు ఇటీవలే విడాకులిచ్చిన ఈమె.. కొద్ది రోజుల కిందట తన కుమార్తె తీసుకుని భారత్‌కు వచ్చేసింది. హజారీబాగ్‌ చేరుకొని షాదాబ్‌ను కలిసిన పోలాక్.. ప్రస్తుతం అతడితోనే ఉంటోంది. ఆమెను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది వస్తుండటం గమనార్హం. అయితే, తన ప్రియుడ్ని తీసుకుని పోలండ్‌కు వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఇక, ఝార్ఖండ్‌లో వేడి వాతావరణానికి తన ప్రియురాలు తట్టుకోలేకపోవడంతో షాదాబ్‌ వెంటనే ఇంటిలో ఏసీని ఏర్పాటు చేశాడు. బార్బరా మాట్లాడుతూ.. ‘‘భారత్‌ చాలా అందమైన దేశం.. నాకు చాలా ఇష్టం.. ఇక్కడి ప్రజలు ప్రేమ, అభిమానం కురిపిస్తారు.. నన్ను చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారు.. అయితే, తనకు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం నచ్చదు’’ అని చెప్పింది. మాలిక్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. అతడు 'అద్భుతమైన' వ్యక్తి అని, చాలా మంచివాడని అంది.


మాలిక్ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన పొలాక్.. వారికి ఇంటి పనుల్లో సాయం చేస్తోంది. అంతేకాదు, చేతులకు గ్లౌజులు వేసుకుని పశువుల కొట్లాంలో పేడ ఎత్తి, ఊడ్చటం వంటివి కూడా చేయడం చేస్తున్నారు. మరోవైపు, ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హజారీబాగ్‌ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ ఖుత్రా గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. ‘నేను పోలాక్‌తో మాట్లాడాను.. మరికొద్ది రోజుల్లో పోలండ్‌ వెళ్లిపోతానని చెప్పింది.. షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలండ్‌ తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది’ అని డీఎస్పీ చెప్పారు. భారత్‌కు పర్యాటక వీసాతో వచ్చిన బార్బారా పోలాక్‌కు.. ఆ వీసా గడువు 2027 వరకూ ఉంది. ఇక, ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, హజారీబాగ్ ఎస్డీఎం కోర్టులో ఇందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa