ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీకి జగన్.. ఏపీకి లోకేష్.. ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఏపీ రాజకీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 10:44 PM

ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం జగన్ తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. జగన్ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. కాగా.. గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి జగన్ పయనమవనున్నారు.


ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టు తర్వాత కొద్ది రోజులే ఢిల్లీ వెళ్లి.. అక్కడే మకాం పెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రేపు తిరిగి విజయవాడకు రానున్నారు. ఎల్లుండి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన తండ్రి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించనున్నారు. మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. మళ్లీ లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు.


అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని టీడీపీ వర్గాలు ఆశలు పెట్టుకునున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ సమయంలో సీఎం జనగ్ కేంద్ర పెద్దలతో భేటీ కానుండటం.. రాష్ట్ర పరిస్థితులను వివరించనుండటంతో ఎలాంటి పరిణామాలు ఎదురవనున్నాయన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే.. ఈయన అటు.. ఆయన ఇటు రావటం మళ్లీ.. ఆయన ఇటొచ్చే సమయానికి ఈయన అటు వెళ్లటం.. యాదృశ్చికమో కాకతాళీయమో కానీ.. ఈ పయనాలు మాత్రం ఇప్పుడు ఏపీలో చర్చకు తెరలేపాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa