ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక జనరేషన్ కల నెరవేరింది,,,రైతులంతా కలిసి నిర్మించుకున్న వంతెన ఇది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 10:21 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చిన్న గ్రామం ఇది. పేరు కలిగొట్ల. ఈ గ్రామంలోని రైతులకు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో సాగు భూములు ఉన్నాయి. పొలాలకు చేరుకోవాలంటే రోజూ వీళ్లు వయ్యేరు నదీ ప్రవాహాన్ని దాటాల్సిందే. నదిని దాటేందుకు రైతులు బల్లకట్టు (చెక్కలు, ఇనుము ఉపయోగించి చేసిన ఒక సంప్రదాయ బోటు లాంటిది)ను ఉపయోగిస్తారు. అయితే, తుప్పు పట్టడం వల్ల రెండేళ్లకు ఒకసారి ఈ బల్లకట్టును మార్చుకోవాల్సి వచ్చేది. అంతేకాదు, అలా ప్రయాణం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. నదిని దాటేందుకు బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి అభ్యర్థనలు అరణ్య రోదనలే అయ్యాయి.


వయ్యేరు నదిపై వంతెన నిర్మించాలనేది కలిగొట్ల గ్రామంలో ఒక జనరేషన్‌ నుంచి ఉన్న కల. ఆ కలను నిజం చేసుకునేందుకు రైతులే సంకల్పించారు. 2021లో రైతులు ఒక బృందంగా ఏర్పడి, విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. వారి ప్రయత్నం, తపన గురించి తెలిసుకొని.. వేగేశ్న ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశ్న అనంత కోటి రాజు తన మంచి మనసుతో అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. 25 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. దీంతో వంతెన నిర్మాణానికి కీలక ముందుడుగు పడింది. రైతులందరూ కలిసి సేకరించిన రూ. 45 లక్షలు, వేగేశ్న అనంత కోటి రాజు అందించిన రూ. 25 లక్షలు కలిపి మొత్తం రూ. 70 లక్షలతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికి ‘సద్గుణాంబ వారధి’ అని పేరు పెట్టుకున్నారు. సంప్రదాయ పూజలతో వంతెనను ప్రారంభించారు. ఇప్పుడు ఈ వంతెన మీదుగా గ్రామస్థులు సంతోషంగా తమ పంట పొలాలకు వెళ్తున్నారు. వేగేశ్న అనంత కోటి రాజు చేతుల మీదుగానే రైతులు ఈ వంతెనను ప్రారంభించుకున్నారు. ఆయన సాయం చేసుండకపోతే తమ కల సాకారం అయుండేదికాదని వాళ్లు అంటున్నారు. కలిగొట్ల సాధించిన ఈ విజయగాథ గురించి గ్రామానికి చెందిన నీలమ్ ప్రసాద్ ట్విటర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. వంతెనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ కార్యంలో తాను, తన కుటుంబం కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


‘మొక్కవోని సంకల్పం, సంఘటిత శక్తి, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం ఈ కథ. ఎవరూ మద్దతివ్వని వేళ తమ సమస్యను పరిష్కరించుకునేందుకు రైతులే చేయి చేయి కలిపారు. సంఘానికి ఉన్న శక్తి ఇది. మా గ్రామం సాధించిన విజయాన్ని వేడుక చేసుకోవడంలో మీరూ భాగమవ్వండి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, మీ సమస్యలు పరిష్కరించుకునేందుకు మీరే బాధ్యత తీసుకోండి’ అని నీలమ్ ప్రసాద్ రాసుకొచ్చారు. నిజమే కదూ.. అందరూ కలిస్తే, అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చనడానికి ప్రత్యక్ష సాక్షం ఇది. హ్యాట్సాఫ్ కలిగొట్ల.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa