టీడీపీ నేత కిలారు రాజేష్ పేరును వెబ్సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. ఆ పేరును తొలగించాలని అధికారులకు సూచించామన్నారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఆయన కోరారు. దీంతో విచారణను ఈ నెల 17కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి వాయిదా వేశారు. రాజేష్ను ఓ వైపు సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసు ఇస్తూ.. మరోవైపు నిందితుడిగా పేర్కొన్నారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. హైదరాబాద్లో ఉంటున్న రాజేష్పై నిఘా పెట్టారని.. బెదిరిస్తున్నారన్నారు. ఇంటిలిజెన్స్ వారు వెంబడిస్తున్నారని.. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ వ్యక్తి ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్కు చెందిన హెడ్ కానిస్టేబుల్గా తేలిందన్నారు. మొదటి నోటీసును గౌరవించి ఆయన సీఐడీ ముందు హాజరయ్యారన్నారు.
నేరానికి పాల్పడినట్లు అంగీకరించాలని బెదిరించారని కోర్టుకు తెలిపారు. తెలంగాణలో నివసించే ఆయనకు నోటీసిచ్చి తమ ముందు హాజరుకావాలని కోరే పరిధి ఏపీ సీఐడీకి లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సీఐడీని నిలువరించాలని కోరారు. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరును వెబ్సైట్లో నిందితునిగా పేర్కొనడంలో పొరపాటు జరిగిందని.. తొలగించాలని అధికారులకు మౌఖికంగా తెలిపామన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో తనను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేస్తూ.. వెబ్సైట్లో తనను నిందితుడిగా చూపుతోందని రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై లుకౌట్ నోటీసులు జారీచేసిందంటూ కిలారు రాజేష్ శుక్రవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను రద్దు చేయాలని కోరారు. తనను ప్రశ్నించేందుకు ఇంటెలిజెన్స్ డీజీ, మరికొందరిని అనుమతించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ, సీమెన్స్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
స్కిల్ కేసులో తాను విచారణ నిమిత్తం ఈ ఏడాది అక్టోబర్ 16న సీఐడీ ముందు హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. మోహన్, సుదర్శన్లు తనను 50 నిమిషాలు ప్రశ్నించారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు చెందినవారి గురించి అడిగారని.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు. డీజీ తనను రమ్మన్నారని సీఐడీ డీఎస్పీ చెప్పడంతో డీజీ ఛాంబర్కు వెళ్లానన్నారు. ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి అక్కడ ఉన్నారని.. ఆ సమయంలో ఆంజనేయులు తనను బెదిరించారన్నారు.
తనపై కేసు పెట్టడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని.. తమకు సహకరించకపోతే ఉపేక్షించబోమని.. కేసు దర్యాప్తుతో సంబంధం లేకున్నా ఆయన హెచ్చరించారన్నారు. ఆ తర్వాత సిబ్బంది సెక్షన్ 160, 91 నోటీసులు ఇచ్చి.. మరుసటి రోజు ( అక్టోబర్17న) మళ్లీ రావాలని చెప్పారన్నారు. మూడేళ్ల క్రితం డాక్యుమెంట్లను తీసుకురావాలని చెప్పడంతో.. సాధ్యం కాదని చెప్పానన్నారు. దీనిపై సీఐడీ డీఎస్పీకి 17న సమాచారం ఇచ్చానని.. రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరచకుండా అణచివేయడం కోసం, టీడీపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నానన్న ఉద్దేశంతో తనను వేధిస్తున్నారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నోటీసులు ఇవ్వకుండా సీఐడీని నిలువరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa