చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గృహ ప్రవేశం రోజే మామా అల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు. నిండ్ర మండల పరిధిలోని ఇరుగువాయి దళితవాడలో రాజేష్, మధుబాల దంపతులు కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. గురువారం గృహ ప్రవేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో రాజేష్, అతడి భార్య తండ్రి భాస్కర్ షామియానా వేస్తుండగా.. దాని పట్టలు ఇంటి సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలపై పడ్డాయి. ఆ సమయంలో ఇద్దరూ ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటిదాకా కళ్లెదుట ఉన్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మృతదేహాలకు నగరి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేసి రాజేష్ మృతదేహాన్ని ఇరుగువాయి దళితవాడకు, అతడి మామ భాస్కర్ భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఎస్ఆర్పురం మండలం తయ్యూరు దళితవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజేష్కు భార్య మధుబాల, పిల్లలు సిద్ధు, తేను, రిషి ఉన్నారు.
రాజేష్ ఎంతో కష్టపడి సొంతింటి కల నెరవేర్చుకున్నాడు.. గృహ ప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే విషాదం వెంటాడింది.. ఈ ఘటనతో భర్త రాజేష్, తండ్రి భాస్కర్ని కోల్పోయిన మధుబాల, పిల్లలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. శుభకార్యం జరిగి సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa