ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. ఇక గ్రామ స్థాయిలోనూ వెదర్ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 09:04 PM

వాతావరణ అంచనాలు ఇక నుంచి గ్రామ స్థాయిలోనే తెలుసుకునే అవకాశాన్ని భారత వాతావరణ విభాగం - ఐఎండీ కల్పిస్తోంది. వచ్చే వారం నుంచి దేశంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐఎండీ 150 వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపిన మృత్యుంజయ మహాపాత్ర.. ఆ వేడుకల సందర్భంగా ‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవలను సోమవారం రోజే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.


వాతావరణ మార్పులు, వర్షాలు, ఎండలు, పిడుగుల కారణంగా గ్రామాల్లో ఉండే రైతులు నష్టపోకుండా వారిని ఆదుకునేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని చెప్పారు. వాతావరణ సూచనల్ని మండలాల స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైందని తెలిపారు. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు రైతులతో అనుసంధానం కావాలనేదే తమ లక్ష్యమని ఐఎండీ డెరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, గాలి వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందవచ్చని వెల్లడించారు.


దేశంలో ఏ మూలన ఉన్నవారైనా మొబైల్‌ యాప్‌ ద్వారా వారం రోజుల వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చని మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. గ్రామం పేరు, పిన్‌కోడ్‌, లేదా అక్షాంశ రేఖాంశాలను ఎంటర్ చేసి వాతావరణ వివరాలను తెలుసుకోచ్చని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. పిడుగుపాటు హెచ్చరికలను ప్రస్తుతం దేశంలోని 1200 నగరాలు, పట్టణాల్లో అందిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో తమ రాడార్లు 39 నుంచి 86 కి పెరుగుతాయని.. రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు.


వాతావరణ సమాచారంతో వర్షాలు ఎప్పుడు పడతాయో తెలుసుకుని వర్షంపై ఆధారపడి పంటలు పండించే ప్రాంతాల్లోని రైతులు లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఇప్పటివరకు 3 కోట్ల మంది రైతులకు చేరువైనట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. వారికి రూ.13,300 కోట్ల మేర లబ్ధి కలిగిందని చెప్పారు. దేశంలోని 10 కోట్ల మంది రైతులకూ తాము సేవలు విస్తరించగలిగితే దేశ జీడీపీ భారీగా పెరుగుతుందని వివరించారు. ప్రజలు నిర్మాణ పనులు ప్రారంభించే ముందు.. పెళ్లిళ్లు చేసే ముందు వాతావరణ వివరాలు తెలుసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa