ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్,,,విధులకు హాజరుకాని వారిని తొలగింపునకు రెడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 07:07 PM

ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను తొలగించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరుకాని అంగన్‌వాడీలను ఇవాళ సాయంత్రానికి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఎస్మా చట్టంలోని నిబంధనలు ప్రకారం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ నోటీసులకు అంగన్వాడీలు రిప్లై ఇవ్వగా.. దానితో సంతృప్తి చెందలేదని అధికారులు చెబుతున్నారు.


మరోవైపు అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే పనిలో ఉన్నారు. ఈ నెల 26 నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు అంగన్‌వాడీ కేంద్రాలను కూడా స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అంతేకాదు ప్రభుత్వం కనుక కొత్త నొటిఫికేషన్ జారీ చేస్తే కొత్తవారికి అవకాశం దక్కుతుంది.. ఇది వారికి శుభవార్తే అని చెప్పాలి. ఇవాళ చలో విజయవాడలో భాగంగా అంగన్‌వాడీలు పలు జిల్లాల నుంచి విజయవాడకు వచ్చారు.. మరికొందర్ని వచ్చే క్రమంలోనే ఆయా జిల్లాల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీలను తొలగిస్తూ ఇస్తున్న ఉత్తర్వులపై ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలగింపు ఉత్తర్వులను కోర్టుల్లో సవాల్ చేస్తామంటున్నారు.


అంతేకాదు అంగన్‌వాడీల చలో విజయవాడ పిలుపుతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. సీఎం ఇంటి చుట్టుపక్కల మూడంచెల భద్రతా వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వద్ద సర్వీస్ రోడ్డులో ప్రతి ఒక్కరిని పోలీస్ సిబ్బంది తనిఖీ చేసి మరీ పంపుతున్నారు. గుంటూరు వైపు నుంచి సీఎం నివాసం వైపు వస్తున్న అంగన్‌వాడీలను, కార్మిక సంఘాల నేతలను కాజా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా అక్కడి నుంచి తరలించారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్‌వాడీ నేతలను కూడా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు.


విజయవాడలో కూడా పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఐరన్ ఫెన్సింగ్ వేశారు.. కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్, బీఆర్‌టీఎస్ రోడ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా కానిస్టేబుళ్లను విజయవాడకి రప్పించారు. బీఆర్‌టీఎస్ రోడ్‌లోకి అంగన్‌వాడీలు దశల వారీగా వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అంగన్‌వాడీలను తరలించేందుకు బీఆర్‌టీఎస్ రోడ్‌లోకి భారీగా బస్సులను తరలించారు. అరెస్ట్ చేసిన అంగన్‌వాడీలను ఏఆర్ గ్రౌండ్‌కు తరలిస్తున్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాలు, సీపీఐ, సీపీఎం, యువజన సంఘాల నేతలు తరలి వస్తున్నారు. కొద్దిరోజులుగా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవాలంటూ అంగన్‌వాడీలు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా విఫలం అయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa