ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల బరిలో ‘చిరుత’ హీరోయిన్.. ఆ పార్టీ తరఫున అక్కడి నుంచే పోటీ

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:21 PM

ప్రస్తుతం దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ క్రమంలోనే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టికెట్ దొరకని నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లి టికెట్ తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు.. పార్టీలు సినిమా హీరో హీరోయిన్లు, క్రికెటర్లు, బిజినెస్‌మెన్‌లు, ఇతర ప్రముఖులకు టికెట్లు ఇచ్చి తమ పార్టీ నుంచి బరిలో దింపుతున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన నేహా శర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీహార్ నుంచి ఆమె బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నేహా శర్మ తండ్రి ఒక హింట్ ఇచ్చారు.


నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ.. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భాగల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బీహార్‌ నుంచి నేహా శర్మను లోక్‌సభ బరిలోకి దింపాలని అజిత్‌ శర్మ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అజిత్ శర్మ.. బీహార్‌లోని భాగల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉందని పేర్కొన్నారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా భాగల్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం బీహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఇండియా కూటమి లోచర్చలు జరుగుతున్నాయని అజిత్ శర్మ వెల్లడించారు. ఒకవేళ భాగల్‌పూర్ లోక్‌సభ సీటు కాంగ్రెస్ పార్టీకి వస్తే.. తాను పోటీ చేస్తానని.. లేని పక్షంలో తన కుమార్తె నేహా శర్మను పోటీలో ఉంచాలని భావిస్తున్నట్లు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అయితే ఈ విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నానని.. చివరికి హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అజిత్ శర్మ స్పష్టం చేశారు.


బీహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. కానీ ఇండియా కూటమి మాత్రం ఇంకా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే బీహార్‌లో ఇండియా కూటమి పార్టీలు పోటీ చేసే స్థానాలపై ప్రకటన ఉంటుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు. ఇక రామ్‌చరణ్‌ మొట్టమొదట నటించిన చిరుత సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహా శర్మ.. ఆ తర్వాత కుర్రాడు చిత్రంలో కన్పించింది. ఆ తర్వాత తెలుగు చిత్రసీమ నుంచి వెళ్లిపోయి.. కొన్ని బాలీవుడ్‌, తమిళ్‌, మలయాళ సినిమాల్లో నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa