తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధం లేదని, ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్లకైనా సిద్ధమని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ప్రకటించారు. తాను ఆమె దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించానని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో చాలా కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగానన్న మాజీ మంత్రి, నాడు వైయస్ఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా పని చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత క్రమంగా మంత్రిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు.
‘నిరంతరం నేను ప్రజల మధ్య ఉంటాను. నన్ను కలిసేందుకు, నా సహాయం కోసం అనేక మంది వస్తుంటారు. ఎవరికైనా సరే సహాయం చేయాలని అనుకుంటాను. నాపై ఈ ఆరోపణలు, ఫిర్యాదు అంతా కూడా కుట్ర ప్రకారం జరిగింది. చాలా బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు’ అని మెరుగు నాగార్జున వెల్లడించారు. తనపై చేసిన ఫిర్యాదుపై తానే స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్ధాయి విచారణ కోరుతానని మాజీ మంత్రి తెలిపారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయట పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానన్న ఆయన, కుట్ర వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa