ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌లో పోలవరం, స్టీల్‌ప్లాంట్‌కు నిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 07:53 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేటాయించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ. 54 కోట్లు కేటాయింపులు చేశారు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రతిపాదించారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.3,295 కోట్లు ప్రతిపాదించారు. విశాఖపట్నం పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ఇందుకోసం రూ.240 కోట్లు కేటాయించారు. అలాగే ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి, ఏపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ తరుఫున కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ ద్వారా తయారీ రంగంలో ఏపీకి మేలు జరుగుతుందని.. పౌర విమానయాన రంగంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే ఉడాన్ స్కీం ద్వారా 120 కొత్త డెస్టినేషన్‌లను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడు నెలల కాలంలో అమరావతికి రూ.15000 కోట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.16,440 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12000 కోట్లు సాయం దక్కిందని రామ్మోహన్ నాయుడు వివరించారు.


కేంద్ర బడ్జెట్ 2025లో సామాన్యుడికి, రైతులకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేటాయింపులు జరిగాయని రామ్మోహన్ నాయుడు వివరించారు. అలాగే ఏపీలో జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకూ పొడిగించారని, కేంద్రం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని టూటైర్, త్రీటైర్ నగరాలకు నిధులు వస్తాయని తెలిపారు. రైతులు, తీర ప్రాంతం అధికంగా ఉన్న ఏపీకి ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు ఉన్నాయని.. కేంద్ర బడ్జెట్‌లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com