ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకు కాఫీకి విస్తృత ప్రచారం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 03:14 PM

పార్లమెంట్‌లో అరకు కాఫీ  ప్రారంభం సందర్భంగా పలువురు ఎంపీలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ... చాలా మంది ఎంపీలు తమ ప్రాంతంలో అరకు కాఫీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని, ప్రజలు ఆయనపై విశ్వాసం, నమ్మకం పెట్టుకున్నారని, దేశంలో చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నాయకుడని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీకి 11 సీట్లుకే పరిమితం చేసి.. గుణపాఠం చెప్పినా ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి ఇంకా మారలేదని ఎంపీ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సోమవారం ఉదయం (24వ తేదీ) అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. సభాపతి ఆదేశంతో రెండు స్టాల్స్ ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం కాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసింది. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.తూర్పు కనుమల నుండి భారత దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గిరిజనుల స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్‌లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపిస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com