కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. అలిపిరి నడకమార్గంతో పోలిస్తే శ్రీవారిమెట్టు మార్గం మెట్లు తక్కువగా ఉండటంతో కొంతమంది భక్తులు అక్కడి నుంచి తిరుమలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక తిరుమలకు కాలినడకన వెళ్లేవారికి టీటీడీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల వద్ద శ్రీవారి దివ్య దర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తోంది. అయితే శ్రీవారిమెట్టు వద్ద వీకెండ్స్, సెలవు రోజుల్లో ఈ దివ్యదర్శనం టైమ్స్లాట్ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటోంది.
ఈ డిమాండ్ను కొంతమంది ఆటోడ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శ్రీనివాస మంగాపురం, రైల్వే స్టేషన్, తిరుపతి బస్టాండ్ వద్ద మాయమాటలు చెప్పి శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఇప్పిస్తామని ఆటోలలో ఎక్కించుకుంటున్నారు. ఒక్కో భక్తుడి నుంచి వందల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం తనిఖీలు నిర్వహించారు, తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు టోకెన్లు పొందటంలో అసౌకర్యానికి గురౌతున్నట్లు తెలియటంతో టీటీడీ ఈవో, టీటీడీ ఏఈవో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని టీటీడీ ఈవో చెప్పారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోడ్రైవర్లు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు తెలిసిందన్నారు. భక్తుల నుంచి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్న టీటీడీ ఈవో.. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుంటామని.. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు బస్సుల సంఖ్య పెంచటం సహా.. శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పెంచే విషయాన్ని ఆలోచిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa