రాష్ట్రంలో తప్పకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో ఆయన మాట్లాడుతూ.... చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేసిన తర్వాత, మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. మీలో అందరూ నాతోనే నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్న వారు. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాం. గడిచిన 11 నెలల కాలంగా ఆ దిశలోనే అడుగులు వేశాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్ని పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. జిల్లా అధ్యక్షులు ఒక్కరే ఈ పూర్తి బాధ్యత నెరవేర్చలేరు. వాళ్లకు కూడా సరైన సపోర్ట్ మెకానిజమ్ క్రియేట్ అయితేనే వాళ్ల బాధ్యతను వాళ్లు సక్రమంగా చేయగలుగుతారు. ఆ సపోర్ట్ ఎకో సిస్టంలో భాగంగానే రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది అని దిశా నిర్దేశం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa