భూ వివాదం ఇద్దరి హత్యకు దారి తీసింది. భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన చిగిచెర్ల ముత్యాలమ్మ(46), చిగిచెర్ల నారాయణరెడ్డి(56) దంపతులు ప్రాణాలు కోల్పోయారు. రాప్తాడుకు చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డికి గంగలకుంట రెవెన్యూ సర్వే నంబర్ 78-3లో (పాత సర్వే నంబర్) 6.20 ఎకరాల భూమి ఉండేది. దీన్ని 1997లో రాప్తాడుకు చెందిన కాటమిరెడ్డి ముగ్గురు కుమార్తెలు పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మికి ఎకరం రూ.15 వేల చొప్పున విక్రయించారు. కొనుగోలుదారులు రూ.93 వేలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్కు నారాయణరెడ్డి కాలయాపన చేశారు. దీంతో భూమి కొన్నవారు కోర్టును ఆశ్రయించారు. 2012లో అనంతపురం సివిల్ కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు రిజిస్ర్టేషన్ పూర్తైనా నారాయణరెడ్డే ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. దీంతో భూమి కొన్నవారు హైకోర్టును ఆశ్రయించారు. 2022లో హైకోర్టు కూడా వారికే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది జనవరి 7న రెవెన్యూ అధికారులు కొనుగోలుదారుల పేరిట భూమిని ఆన్లైన్ చేయించారు. ఈ క్రమంలో రాప్తాడు, సమీప గ్రామాలకు చెందిన కొందరు ఆ భూమిని పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి నుంచి ఎకరం రూ.60 లక్షల చొప్పున కొన్నట్టు అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ శనివారం ఉదయం పొలానికి వెళ్లి ఎక్స్కవేటర్తో పొలంలోని దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా.. నారాయణరెడ్డి, ఆయన భార్య ముత్యాలమ్మ, కుమారుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, బావమరిది ప్రతాప్ రెడ్డి అక్కడికి రావడంతో ఇరువర్గాలకు ఘర్షణ జరిగింది. వేట కొడవళ్లతో దాడి చేయడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతా్పరెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన నలుగురు గాయపడ్డారు. దాడిపై ప్రదీప్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa