ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి అదనంగా రూ. 5 లక్షలు,,,టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:18 PM

టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న 29 మంది అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు.


స్వచ్ఛంద పదవీవిరమణకు అంగీకరిస్తే.. పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు కమిటీ సిఫార్సులు, సలహాల ఆధారంగా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్విమ్స్‌లోని వివిధ విభాగాలకు సంబంధించి 597 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు.


మరోవైపు 2024 నవంబర్ 18న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను గుర్తించి, వారిని ఇతర విభాగాలకు బదిలీ చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వానికి నివేదించారు. టీటీడీలో సుమారుగా 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో 200 నుంచి 300 మంది ఉద్యోగులు అన్యమతస్థులని అంచనా. అయితే అన్యమతస్థుల సంఖ్యను గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు టీటీడీ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, ఆలయ సంప్రదాయాలను హిందూ మతస్థులు మాత్రమే నిర్వహించాలని నిబంధనలు చెప్తున్నాయి.


ఈ నేపథ్యంలో టీటీడీలోని అన్యమత ఉద్యోగులను ధార్మిక కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచడం లేదా బదిలీ చేయడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే వారికి రూ. 5 లక్షలు అదనంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో పచ్చదనం పెంపొందించాలని అందుకు ఏటా నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.


అలాగే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో నిత్యాన్నదానం సేవలు అందించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుచానూరు, కపిలతీర్థం సహా పలు ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. ఇందుకోసం ఆర్కిటెక్టుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa