ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 08:05 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య క్రమంగా అధికమవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు నిఘా పెంచి, ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. అయితే, ప్రస్తుతానికి నమోదవుతున్న కేసులన్నీ స్వల్ప లక్షణాలతోనే ఉన్నాయని, ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్క ముంబై నగరంలోనే మే నెలలో 95 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 106 కేసుల్లో ఇవి అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వీరిలో చాలామందిని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేఈఎం ఆసుపత్రి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఇన్ ఫ్లుయెంజా లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు, పుణె నగరంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాక్టివ్ కేసులు లేనప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను సిద్ధం చేశారు. మే నెలలో మంజరీ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే కోవిడ్ బారిన పడి, పూర్తిగా కోలుకున్నారని పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం చీఫ్ డాక్టర్ నీనా బోరాడే తెలిపారు. నగరంలోని సివిక్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.తమిళనాడులోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు వెలుగుచూశాయి. చెన్నై నగరంలో గతంలో ఇన్ ఫ్లుయెంజాగా భావించిన జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా కోవిడ్-19గా నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు కారణంగా అవయవ మార్పిడులు, గుండె శస్త్రచికిత్సలు వంటి కీలకమైన ఆపరేషన్లను కూడా వాయిదా వేస్తున్నారు.కర్ణాటకలో 16 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ధృవీకరించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక్కరోజే ఏకంగా ఏడు కొత్త కేసులు బయటపడ్డాయి. గత ఏడాది కాలంగా నెలకు సగటున ఒక కేసు మాత్రమే నమోదైన ఈ నగరంలో ఇది అసాధారణ పెరుగుదలగా అధికారులు గుర్తించారు. బాధితులందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, వారి నమూనాలను జన్యు పరీక్షల కోసం పంపించామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa