ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుల బంధువుల మాటలు సైతం లెక్కచెయ్యకుండా, వీరిపై కేసు నమోదు చెయ్యడం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 04:09 PM

ఈ నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే టీడీపీ నాయకుల హత్యలు జరిగాయి. ఈ జంటహత్యలకు టీడీపీలోని వర్గపోరు కారణమని, చనిపోయినవారు, ముద్దాయిలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలోనే ప్రకటించారు. కానీ హటాత్తుగా ఈ కేసులో వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎక్కించడం హేయమైన చర్య అని నరసరావుపేట వైసీపీ ఇంచార్జి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైయస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేయడం ఒక అలవాటుగా మారింది. పేర్ని నాని కుటుంబంమీద, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్ ఇలా పలువురు నాయకులపై పెద్ద ఎత్తున తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు ఇది నిదర్శనం. ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా వున్న జవిశెట్టి శ్రీను హత్య తరువాత మాట్లాడుతూ వచ్చేది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే, మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అండ వుంది, వారు చెబితేనే ఇలా చేస్తున్నాం, మాకు ఏదైనా ఆపద వస్తే వారే చూసుకుంటారు అని బెదిరించి వెళ్లినట్లు ఎఫ్ఐఆర్‌లో రికార్డు చేశారు. ఇది పోలీసులు కట్టుకథ కాదా? హంతకులు పారిపోతూ, తాము చేసిన దాని గురించి వివరాలు చెప్పి పరారైనట్లు పోలీసులు రికార్డు చేశారు. ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అలాగే సంఘటనా స్థలంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి చెందిన వాహనంలోనే ముద్దాయిలు వచ్చారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జవిశెట్టి శ్రీను అనే వ్యక్తి గతంలో వైయస్ఆర్‌సీపీలో పనిచేశాడు, గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరాడు. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఆయన పనిచేశాడు. గత పదిహేను రోజుల వరకు కూడా హత్యకు గురైన వారితోనే కలిసి రాజకీయాలు చేశాడు. ఇటీవల ఒక ఫ్లెక్సీ వివాదంలో ఒక యువకుడిని ఒకవర్గం కొట్టడంతో జెవిశెట్టి శ్రీనుకు, చనిపోయిన వారికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ముద్దాయి జవిశెట్టి శ్రీను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తలా పనిచేశాడు. అతను చేసిన ఈ హత్యకు పిన్నెల్లి సోదరులకు ఏం సంబంధం? తోట వెంకట్రామయ్య అనే వ్యక్తి జవిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ఈ హత్యలు చేయించారని మృతుల బందువులే చెబుతున్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ నాయకులను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఈ రకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు. జిల్లా ఎస్పీని కూడా కలిసి వినతపత్రం సమర్పించేందుకు సమయం కావాలని కూడా అడిగాం. ఇటువంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేసి, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన నాయకుడి మీదే ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa