ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేచర్లపేటలో.. ఒకే గదిలో తల్లీ, కొడుకు మృతదేహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 07:58 PM

కాకినాడలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలేమైంది.. ఎందుకంత కఠి నిర్ణయం తీసుకున్నారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. కాకినాడలోని రేచర్లపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేచర్లపేటలో.. ఒకే గదిలో తల్లీ, కొడుకు మృతదేహాలు కనిపించాయి. చనిపోయింది రమ్యదీప్తి అనే వివాహిత, ఆమె కొడుకు నాలుగేళ్ల ప్రశాంత్‌గా పోలీసులు తెలిపారు. రమ్యదీప్తి రెండు నెలల కిందటే అబుదాబి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె భర్త శరత్‌బాబు గల్ఫ్‌లో ఉన్నారు.


అయితే రమ్యదీప్తి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రమ్యదీప్తి ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అదే గతిలో నాలుగేళ్ల ప్రశాంత్ మృతదేహం కూడా ఉంది. ప్రశాంత్ చేతులు, కాళ్లూ, అలాగే నోరు, ముక్కుకు ప్లాస్టర్లు అంటించి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.


అయితే ఒకే గదిలో తల్లీ, కొడుకు మృతదేహాలు లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా, ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే రమ్య దీప్తి ఫోన్ కాల్ డేటా విశ్లేషించే పనిలో ఉన్నారు. నాలుగేళ్ల చిన్నారి ప్రశాంత్‌ కాళ్లూ, చేతులు కట్టేసి ఉండటం.. రమ్య దీప్తి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


మరోవైపు ఓ ప్రమాదంలో నుంచి బయటపడ్డామని సంతోషించేలోపు మరో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొవ్వూరు మండలం కాపవరం వద్ద ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొనటంతో.. రెండు వాహనాల్లోని డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన బత్తుల శీనయ్య అనే వ్యక్తి లారీలో ధాన్యం లోడుతో హైదరాబాద్ నుంచి మండపేట వెళ్తున్నారు. అయితే కాపవరం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ దెబ్బతినడంతో.. శీనయ్య లారీని రోడ్డు పక్కనే ఆపేశారు. రోడ్డుపై పడిన అద్దం ముక్కలను తొలగించే ప్రయత్నంలో ఉన్నారు.


అయితే ఇదే సమయంలో కాకినాడ జిల్లా కత్తిపూడికి చెందిన బాబూరావు అనే వ్యక్తి వ్యాన్‌లో ధాన్యం లోడుతో కొవ్వూరుకు వస్తున్నారు. కాపవరం వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, శీనయ్యను.. బాబూరావు గుర్తించలేదు. దీంతో బాబూరావు వ్యాన్.. శీనయ్యను, రోడ్డుపక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబూరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శీనయ్య ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయారు. దీంతో ఒక ప్రమాదం తప్పిందనుకుంటే.. మరో ప్రమాదం రూపంలో శీనయ్యను మృత్యువు బలితీసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa