ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్ 'రెడ్బుక్' విషయాన్ని తలచుకుని భయపడుతున్నారని ఆరోపించారు.
"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలపై అక్రమ కేసులు బలవంతంగా మోపబడ్డాయి. ప్రజలకు అన్యాయం చేసి, వెన్నుపోటు పొడిచిన పాలన అది," అని అఖిల అన్నారు. మద్యం నిషేధం పేరుతో కూడా ప్రజలను మోసగించారని, అది జగన్ పాలనలో మరో పెద్ద మోసమని పేర్కొన్నారు.
భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, "వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు, తన సొంత తల్లి, చెల్లిని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. ఇంతకంటే దారుణమైన తీరు ఏముంటుంది?" అంటూ మండిపడ్డారు.
తదుపరి ఆమె, వైసీపీ హయాంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుభవించిన తీవ్ర వేధింపులను గుర్తు చేస్తూ, "ఆయనపై అమానుషంగా వ్యవహరించారు. ఇవన్నీ ప్రజలముందు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి," అన్నారు.
ఈ వ్యాఖ్యలు, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఈ విమర్శలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa