మహిళలను కించపరిచిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, అమరావతిపై విషప్రచారం చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
"మహిళలను అవమానించిన జగన్ ముఠాను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అవుతుంది," అని లోకేష్ తన 'ఎక్స్' ఖాతాలో ట్వీట్ చేశారు.
"మహిళలను కించపరిచేలా 'చీర, గాజులు పెడతాం, ఆడపిల్లలా ఏడవొద్దు' వంటి మాటలు మాట్లాడిన వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అమరావతిపై అసత్య ప్రచారం చేస్తూ, మహిళలను అవమానించిన జగన్ బేషరತుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి," అని లోకేష్ హెచ్చరించారు.
అమరావతిని 'దేవతల రాజధాని'గా అభివర్ణిస్తూ, జగన్ను 'దెయ్యం'గా పేర్కొన్న లోకేష్, మహిళల త్యాగాలు, గొప్పతనం గురించి జగన్కు ఏమీ తెలియదని విమర్శించారు. "మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు. మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగం నయం చేస్తాం," అని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళల భద్రత, గౌరవం కోసం కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa