వికలాంగత్వం ఎక్కువగా ఉండి పింఛన్ రావాలంటే తనకు డబ్బు పంపాలంటూ ఓ వ్యక్తి అనంతపురం జిల్లా, రామగిరి మండలంలోని పలువురు దివ్యాంగులకు ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు 10మందికిపైగా ఫోన్ చేసి తన పేరు శివ అని, కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్నానని చెప్పి, డబ్బు వసూళ్లకు పూనుకున్నట్లు సమాచారం. చెన్నేకొత్తపల్లిలో దివ్యాంగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్కు వెళ్లినప్పుడు మీ పర్సెంటేజీ తగ్గించారని,దీంతో పింఛన్ రాదని, పర్సెంటేజీ ఎక్కువగా వేయాలంటే రూ.25వేలు తనకు ఫోన్పే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇప్పుడు మీవద్ద ఎంత ఉంటే అంత పంపండి. మిగతాది తర్వాత చూద్దాం అంటూ బేరసారాలకు దిగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మరికొందరికి ఫోన్ చేసి మీ పింఛన్ నెలకు రూ.15వేలు వచ్చేలా చేస్తానని, దానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, అయితే అది ఇప్పుడు కాదు మళ్లీ నెలలో చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆయన మాయ మాటలకు మోసపోయిన ఒకరిద్దరు డబ్బులు ఫోన్పే చేసినట్లు సమాచారం. ఇతడికి ఫోన్ చేస్తే శివ ఏఎస్ఏ, పీటీపీ అని ట్రూకాలర్లో వస్తోందని, ఫోన్పే చేయాలంటే సాకే శివయ్య అని వస్తున్నట్టు బాధితులు తెలిపారు. ఇతడి గురించి కలెక్టర్ ఆఫీసులో విచారించగా ఆ పేరు గల వ్యక్తి లేరని తెలిసిందన్నారు. దీనిపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa