ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెరవేరిన రైతుల కల.. ఆ భూములన్నీ వెనక్కి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:06 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ సెజ్ రైతుల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ సెజ్ కోసం ఇచ్చిన భూములలో 2 వేల 180 ఎకరాల భూమిని తిరిగి రైతులకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సెజ్‌లో అవార్డు భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్‌లక కోసం రైతుల నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్‌, స్టాంప్ డ్యూటీ వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాకినాడ సెజ్ కోసం భూములు ఇచ్చిన 1,551 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ భూములన్నీ తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఉన్నాయి.


మరోవైపు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కాకినాడ సెజ్) కోసం సుమారు 19 ఏళ్ల కిందట రైతుల నుంచి భూములను సేకరించారు. ఇవ్వడానికి అంగీకరించని వారి నుంచి లాక్కున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం ఈ భూముల యాజమాన్య హక్కులు కూడా సెజ్ పేరిట మారిపోయాయి. అయితే.. కొంతమంది రైతులు మాత్రం ఈ భూముల నుంచి కదల్లేదు. మొత్తం 2,180 ఎకరాలు ఇలాంటి భూములు ఉన్నాయి.


అయితే ఈ భూములను తిరిగి రైతులకు ఇస్తామని.. ఉచిత రిజిస్ట్రేషన్లు చేయిస్తామని వైసీపీ అప్పట్లో హామీ ఇచ్చింది. 2021 మార్చిలో ఉత్తర్వులిచ్చింది. 2022 సంవత్సరం ఆఖర్లో రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కాకినాడ రైతులు ఎదురు చూస్తున్నారు.


మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 నవంబర్ నెలలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉండే సెజ్ రైతులుఈ విషయంపై పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. తమ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు.. సెజ్‌ పేరిట ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, పరిహారాలు అందడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కాకినాడ సెజ్ రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa