ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటిసారి చూసిన ఆ క్షణం.. వంగలపూడి అనిత ఇంట్రస్టింగ్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:16 PM

క్రికెట్ ప్రేమికులకు మహిళల ప్రపంచకప్ మజాను పంచుతోంది. మహిళల ప్రపంచకప్ పోటీలకు మన విశాఖపట్నం వేదిక కావటం మరో విశేషం. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. విశాఖకు ఐదు మ్యాచ్‌లను కేటాయించగా.. ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. ఇక ప్రపంచకప్ సంబరాన్ని విశాఖవాసులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ ఆడే మ్యాచ్‌లకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వస్తున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా విశాఖలో మ్యాచ్ వీక్షించిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న క్రమంలోనే ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తన కూతురితో కలిసి విశాఖలో క్రికెట్ చూస్తున్న ఫోటోను షేర్ చేసిన వంగలపూడి అనిత.. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేశారు.


"క్రికెట్ మైదానం మొదటిసారి చూసిన ఆ క్షణం, చుట్టూ విస్తారమైన పచ్చిక మైదానం, ప్రేక్షకులను చూసి వచ్చే ఆశ్చర్యం, ఏదైనా సాధ్యమే అన్న భావన. విశాఖపట్నంలోని ఒక పోలీసు అధికారి తన కుమార్తెకు ఆ అమూల్యమైన అనుభూతిని బహుమతిగా ఇచ్చారు. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఒక ప్రేరణకి వెలుగు. ఇదే మహిళల క్రికెట్‌ యొక్క హృదయం ప్రతిభకు, ఆశయాలకు ప్రపంచ వేదికగా ఈ మహోత్సవాన్ని ఆతిథ్యమిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది." అంటూ వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


విశాఖలో ప్రపంచకప్


మరోవైపు విశాఖపట్నానికి ఐదు మ్యాచ్‌లను కేటాయించగా.. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అక్టోబర్ 16న ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్‌, అక్టోబర్ 26న ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. భారత్ తన రెండు మ్యాచులను ఇప్పటికే పూర్తి చేసుకుంది. మరోవైపు విశాఖ స్టేడియంలోని ‘ఎ’ గ్యాలరీ స్టాండ్‌కు మిథాలీ రాజ్‌ పేరు పెట్టారు. మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా చేతుల మీదుగా ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది.


స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరును. మూడో గేట్‌కు రావి కల్పన పేరును పెట్టారు. మహిళా క్రికెట్ దిగ్గజాలుగా పేరొందిన మిథాలీ రాజ్‌, రావి కల్పనకు ఈ విధంగా గౌరవం ఇచ్చినట్లు ఏసీఏ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ ఉన్నారు. మిథాలీరాజ్ మొత్తం 10,868 పరుగులు చేశారు. వీటిలో 7 సెంచరీలు, 85 హాఫ్ సెంచరీలు ఉన్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa