ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వైసీపీకి ఛాన్స్ ఇవ్వడంతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:28 PM

బీహార్ రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే, అక్కడ మరోసారి ఎన్డీయే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తోనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి చివరి రోజైన ఆదివారం నాడు ఆయన పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రస్తుతం బీహార్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని, ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ మార్పు జరిగితే మొత్తం ప్రక్రియ గాడి తప్పుతుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ తప్పిదాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. "మా రాష్ట్రంలో 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి' అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చింది. వారు పాలన చేపట్టిన తర్వాత అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. పెట్టుబడులు ఆగిపోయాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి" అని లోకేశ్ హితవు పలికారు.బీహార్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిసి పనిచేస్తేనే బీహార్ కలలు సాకారమవుతాయి. ప్రస్తుతం అభివృద్ధి అనే విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఇది ఆగిపోవాల్సిన సమయం కాదు. అందుకే, మా కూటమికి ఐదోసారి అధికారం ఇవ్వండి. మేమంతా కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కాకముందు బీహార్‌లో 'జంగిల్ రాజ్' నడిచిందని లోకేశ్ గుర్తుచేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాతే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. "నేను పాట్నాలోని పారిశ్రామికవేత్తలతో మాట్లాడాను. ఇక్కడి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పనులపై వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు అత్యధిక నిధులు కేటాయించారు. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన వివరించారు.ప్రధానంగా మూడు కారణాల వల్ల బీహార్‌లో ఎన్డీయే గెలవాల్సిన అవసరం ఉందని లోకేశ్ నొక్కిచెప్పారు. నాయకత్వ పనితీరు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ప్రభుత్వాల కొనసాగింపు అనేవి రాష్ట్ర పురోగతికి కీలకమన్నారు. 'వికసిత భారత్' లక్ష్యాలను చేరుకోవడంలో బీహార్ పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం యువత ఎన్డీయే విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రాలు బలపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సరైన సమయంలో దేశ ప్రజలు సరైన నాయకుడిని ప్రధానిగా ఎన్నుకున్నారని, ఫలితంగా గత దశాబ్ద కాలంలో భారత్ అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa