ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటనలో అపశ్రుతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:59 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రోజున పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అనుకోని ఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ కారు కిందపడి ఓ మహిళకు గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్‌ ముసలిమడుగు వస్తున్నారనే సమాచారంతో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయి వచ్చిన సమయంలో ఒక్కసారిగా వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే హేమలత అనే మహిళ కిందపడగా.. ఆమె కాలిపై నుంచి పవన్ కళ్యాణ్ కారు వెళ్లింది. ఈ ఘటనలో హేమలతకు గాయాలు కాగా.. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో హేమలత కారు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు.


మరోవైపు పలమనేరు పర్యటనలో ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ ఏనుగుల కేంద్రాన్ని 20 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులను ఇందులో ఉంచారు. ఇక్కడే వీటికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కుంకీ ఏనుగుల ద్వారా పొలాలు, జనావాసాల్లోకి వచ్చే అడవి ఏనుగులను కట్టడి చేయనున్నారు. మరోవైపు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగుల విన్యాసాలను తిలకించారు. ఏనుగులకు ఆహారం తినిపించారు. ఏనుగుల శిక్షణ, సంరక్షణ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఇక ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రంలో కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు.. ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కుంకీ ఏనుగులో ఏర్పాటుచేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు కుంకీ ఏనుగులు సెల్యూట్ చేయడం ఆకట్టుకుంది. అలాగే అడవిలోని కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువస్తారు.. మదపుటేనుగులను కుంకీ ఏనుగుల సాయంతో ఎలా నియంత్రిస్తారనే దానిపై కుంకీ ఏనుగులతో చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి.. కోపాన్ని ఎలా అణిచి వేస్తారనేది మావటీలు పవన్ కళ్యాణ్‌కు చూపించారు.


అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి పునాదిరాయి వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa