బలమైన ఆర్థిక బంధాలను ఏర్పరుచుకుంటున్న తరుణంలో భారత్తో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రపంచ దేశాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి శ్రేయస్సుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, నూతన భౌగోళిక-ఆర్థిక క్రమంలో భారత్ తనదైన శైలిలో ముందుకు సాగుతోందని తెలిపారు. సాంకేతికత ద్వారా శ్రేయస్సు, నైతికత ద్వారా విశ్వాసం, సామర్థ్యం ద్వారా వాణిజ్యం అనే మూడు సూత్రాలతో ప్రగతి పథంలో పయనిస్తోందని వివరించారు. అంతర్జాతీయ సహకారాన్ని విస్తృతం చేసేందుకు ఆయన మూడు కీలక సిఫార్సులను ప్రతిపాదించారు. ద్వైపాక్షిక పెట్టుబడులను సులభతరం చేయడం, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర విశ్వాసాన్ని నిర్మించి, నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రగతి గాథ విశ్వాసం, పారదర్శకత, ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధి అనే స్తంభాలపై నిర్మితమైందని గోయల్ కొనియాడారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ, ప్రతి పౌరుడు ఉన్నత జీవన ప్రమాణాలను పొందేలా, భారత్ను ఒక అభివృద్ధి చెందిన, సంపన్న దేశంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. దార్శనిక నాయకత్వం కింద విశాఖపట్నం గొప్ప వారసత్వం, ఆధునిక ఆవిష్కరణలతో కూడిన ప్రపంచ వాణిజ్య కేంద్రంగా అవతరించిందని, ఇది భారతదేశ వృద్ధి కథను ప్రపంచంతో అనుసంధానిస్తోందని ప్రశంసించారు. పారదర్శక పాలన, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ప్రోత్సహించే విధానాల ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa