ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పతంజలి గ్రూప్ పెట్టుబడులు.. రూ.118 కోట్లతో వెల్‌నెస్ హబ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 07:46 PM

ప్రముఖ సంస్థ పతంజలి గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. విశాఖపట్నంలోని ఎండాడ వద్ద పతంజలి వెల్‌నెస్ హబ్ ఏర్పాటు చేయనుంది. రూ.118 కోట్లతో ఈ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ స్పిరిట్చువల్ టూరిజం సర్క్యూట్ స్ట్రాటజీలో ఏర్పాటు కానున్న తొలి ప్రైవేట్ ప్రాజెక్టు ఇదే కావటం విశేషం. మరోవైపు రాష్ట్రంలోని తీర ప్రాంతం వెంబడి ఆరోగ్య, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్.. ఎండాడలో 118 కోట్లతో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఈ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కోసం ఏపీ టూరిజం లాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024-29 కింద ఇప్పటికే అనుమతి కూడా లభించింది.


పతంజలి సంస్థ దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసే తొలి వెల్‌నెస్ హబ్ ఇదే కావటం విశేషం. మరోవైపు ఎండాడలో 5 ఎకరాల్లో ఈ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 30 నెలల్లోగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో పతంజలి గ్రూప్ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 250 మందికి ప్రత్యక్షంగా 25000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు పతంజలి గ్రూప్‌నకు ఇప్పటికే తెలంగాణ , కర్ణాటక వంటి రాష్ట్రాలలో వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయి.


 మరోవైపు 2028 నాటికల్లా టూరిజం రంగంలో 25 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ప్రకటించింది. అందులో భాగంగా తీర ప్రాంతం వెంబడి ఆధ్యాత్మిక, ఆరోగ్య పర్యాటక సర్క్యూట్లు ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం- విశాఖపట్నం సర్క్యూట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది.


మరోవైపు రాష్ట్రంలోని పది ప్రముఖ ఆలయాల వద్ద టెంపుల్ టూరిజం ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సింహాచలం, శ్రీశైలం, అహోబిలం, అన్నవరం, లేపాక్షి, విజయవాడ, ద్వారకా తిరుమల, తిరుపతి, కాణిపాకం వంటి ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం ప్రోత్సహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పతంజలి వెల్ నెస్ హబ్ ద్వారా ఆయుర్వేద, యోగ, పంచకర్మ, ఆక్యూప్రెజర్, నేచురోపతి వంటి సేవలు అందిస్తారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా విశాఖపట్నాన్ని హెల్త్ టూరిజం హబ్‌గా మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa