నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నాయకులు అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. నెల రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్షకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ముందే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్ రాజీనామా కంటే ముందే కుటుంబ సభ్యుల బుజ్జగింపులతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సారథ్యంలో ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు డిప్యూటీ సీఎంగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరనే అంశంపై కాస్త స్పష్టత వచ్చింది. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవారే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని సమాచారం. డిసెంబర్ 30వ తేదీన అజిత్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ నిన్న సాయంత్రం సమావేశమై డిప్యూటీ సీఎం పదవిపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు.
అయితే ఇప్పటికే సీఎం పదవిని దక్కించుకున్న శివసేన కీలకమైన హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలను దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీకి ఆర్థిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కీలకమైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏ పార్టీకి వరిస్తుందో తెలియాల్సి ఉంది. కేబినెట్ విస్తరణ కూడా డిసెంబర్ 30న జరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa