న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ రైల్వేలో ఇటీవల భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు నైతిక బాధ్యతగా ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని సురేశ్ ప్రభునే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా బుధవారం తెలిపారు.‘ఇటీవల చోటుచేసుకున్న రెండు రైలు ప్రమాదాలు నన్ను తీవ్రంగా బాధించాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలనుకున్నాను. కొద్ది సేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నా నిర్ణయాన్ని చెప్పాను’ అని సురేశ్ ప్రభు తెలిపారు.కాగా, రాజీనామా విషయంలో తొందరపాటు వద్దని సురేశ్ ప్రభుకు ప్రధాని మోదీ సూచించారు. ‘వేచిచూడండి..’ అని ప్రధాని తనతో అన్నట్లు రైల్వే మంత్రి చెప్పారు. గత శనివారం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా 60 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యతగా సురేశ్ ప్రభు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభు ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఇంతలో ఆయనే రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. ఈ ప్రమాదాలకు తాను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు సురేశ్ ప్రభు స్పష్టంచేశారు. ఈ ప్రమాదం తర్వాత బాధ్యలెవరో వెంటనే తేల్చాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు సురేశ్ ప్రభు. మెయింటెనెన్స్ సిబ్బంది తరఫు నిర్లక్ష్యంగా కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే బోర్డు ఇంజినీరింగ్ మెంబర్ అశోక్ మిట్టల్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa