మరోమారు గడువు పెంచాలని ఆదాయపన్ను రిటర్నుల దాఖలుదార్లు కోరుతున్నారు. వాస్తవానికి ఈ రిటర్న్ దాఖలు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటికీ సగం మందే రిటర్నులు దాఖలు చేయగలిగారు. ఈ క్రమంలో గడువు పొడిగించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వినతులు వస్తున్నాయి. మరోవైపు గడువు పొడిగించే ప్రణాళిక లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రిటర్నుల దాఖలు గడువు విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ చివరి వరకు పొడిగించారు. కానీ ఈ విడత పెంపు ఉండదని ప్రభుత్వం ముందే చెప్పింది. అయినా, రిటర్నులు సమర్పించేందుకు పన్ను చెల్లింపుదారులు ఉత్సాహం చూపించడం లేదు. జులై 27 నాటికి 40 శాతం రిటర్నులు దాఖలయ్యాయి.
మరోపక్క, ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ లో సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది పేర్కొంటున్నారు. కొందరు రిటర్నుల దాఖలు ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే.. కొందరు ఏఐఎస్/టీఐఎస్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినా, ప్రయోజనం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ మెంట్ (ఏఐఎస్) ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో పన్ను చెల్లింపుదారునకు సంబంధించి అన్ని రకాల ఆర్థిక సమాచారం అందులో ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు పెరిగిపోవడం, టీడీఎస్ జూన్ 15 తర్వాతే అందుబాటులోకి రావడం, ఏఐఎస్/టీఐఎస్ ఆలస్యంగా అప్ లోడ్ చేయడం తదితర కారణాలతో గడువు పొడిగించాలన్న డిమాండ్ నెలకొంది. నిజానికి గత రెండు ఆర్థిక సంవత్సరాలకు ముందు కూడా గడువు పొడిగింపు లభించింది. 2019-20, 2018-19లో ఆగస్ట్ చివరి వరకు, 2017-18, 2016-17లో ఆగస్ట్ 5 వరకు, 2015-16లో సెప్టెంబర్ సెప్టెంబర్ 7 వరకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా గడువు పొడిగింపు లభిస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa