2024 ఎన్నికల ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు.. సగం బీజేపీదే.. ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు
 

by Suryaa Desk | Thu, Apr 25, 2024, 10:35 PM

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగగా భావిస్తారు. ఇక భారత్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అయితే రాను రాను మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహం అధికం అవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికలకు భారీగా ఖర్చులు పెట్టనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే మన సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భావిస్తున్నారు. ఈ ఖర్చులో దాదాపు సగం వాటా అధికారంలో ఉన్న బీజేపీదేనని పేర్కొన్నారు.


ఈసారి లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన ఓపెన్‌సీక్రెట్స్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అయిన రూ.1.2 లక్షల కోట్ల ఖర్చు మన ఎన్నికలు దాటేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే దేశంలో మొత్తం 96.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సరాసరిన ఒక్కో ఓటరుకు రూ.1400 ఖర్చు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయిన రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ కంటే ఎక్కువ ఖర్చులు కానుండటం గమనార్హం.


ఇక దేశంలోని ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు సంబంధించిన అంశాలను సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ.. గత 35 ఏళ్లుగా జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఖర్చు కానున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ రావు అంచనా వేశారు. అయితే ఈ ఖర్చులో ఎన్నికల సంఘంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోటీ చేసే అభ్యర్థులు.. వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని పేర్కొన్నారు.


అయితే ఈసారి ఎన్నికల ఖర్చులు రూ.1.2 లక్షల కోట్లు అవుతాయని ముందుగా అంచనా వేసినట్లు భాస్కర్ రావు తెలిపారు. అయితే.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం.. ఎన్నికల ఖర్చులను లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును రూ.1.35 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు వివరించారు. ఇక ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3, 4 నెలల ముందు నుంచి చేసిన ఖర్చులు కూడా లెక్కలోకి వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా రకరకాల మార్గాల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతుందని తెలిపారు.


ఈ ఖర్చులను ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు, అభ్యర్థులు రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు అంచనా వేయగా.. అందులో 45 శాతం బీజేపీ ఖర్చు పెట్టినట్లు తెలిసింది. అయితే బీజేపీ ఖర్చులు ఈసారి ఎన్నికల్లో మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని భాస్కర్ రావు పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడంచారు. పార్టీల సిద్ధాంతాల కంటే డబ్బుబలం పైనే విశ్వాసం పెరుగుతోందని ఇటీవల రాసిన ‘నెక్ట్స్‌ బిగ్‌ గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ఎలక్షన్స్‌’ పుస్తకంలో ఆయన తెలిపారు.

Latest News
Foreign maids under South Korean govt's pilot project overworked, underpaid: Survey Sat, Jan 17, 2026, 04:00 PM
Singur: A story of political gains and administrative failures where residents still wait for 'manna' Sat, Jan 17, 2026, 03:58 PM
Indian households add Rs 117 lakh crore in 2025 as gold rally boosts wealth Sat, Jan 17, 2026, 03:28 PM
Not regular or institutionalised BRICS activity: MEA on Cape Town naval exercise Sat, Jan 17, 2026, 03:22 PM
CM Yadav condemns Congress MLA Baraiya's remarks on SC/ST women; says LoP Gandhi should take action Sat, Jan 17, 2026, 03:20 PM