స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన క్వార్టర్ బాటిల్.. చివరకు ఎంతకు దిగజారారంటే
 

by Suryaa Desk | Sun, Apr 28, 2024, 07:29 PM

మద్యపానం అనేది ఎంత హాని చేస్తుందో, మనిషిని ఎంతలా దిగజారుస్తుందో తెలియజేసే ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటివరకూ స్నేహంగా మెలిగిన ఇద్దరు స్నేహితులను ఒక్క క్వార్టర్ బాటిల్ వేరుచేసింది. అప్పటి దాకా వారి మధ్యన ఉన్న స్నేహాన్ని మరిచిపోయేలా చేసింది. స్నేహితుల మధ్య గొడవకు కారణమై.. చివరకు ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం జరగ్గా.. పోలీసులు కేసును చేధించారు. హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టారు.


పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. యర్రగొండపాలెనికి చెందిన వెలగల శ్రీనివాసులు, ఓరుగంటి రాజేష్ అనే ఇద్దరు స్నేహితులు. అయితే ఇద్దరూ కూడా మద్యానికి బానిసలుగా మారిపోయారు. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఉదయం శ్రీనివాసులు.. మద్యం తాగేందుకు రెండు క్వార్టర్ బాటిళ్లు తెచ్చుకున్నాడు. ఇది గమనించిన రాజేష్.. అందులో ఒకటి తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అందుకు శ్రీనివాసులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తగా.. ఆవేశంలో శ్రీనివాసులు రాజేష్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు స్నేహితులు విడిపోయారు.


అయితే శ్రీనివాసులు తనపై చేయి చేసుకున్న విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజేష్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అదే రోజు రాత్రి ఒకటిన్నర సమయంలో శ్రీనివాసులు నిద్రపోయే చోటుకు చేరుకున్నాడు. శ్రీనివాసులు నిద్రపోతున్న సంగతిని గమనించి.. తనవెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో శ్రీనివాసులుపై దాడిచేశాడు. అనంతరం చనిపోయాడని నిర్ధారించుకుని ఇనుపరాడ్ అక్కడే పడేసి.. ఘటనాస్థలం నుంచి ఉడాయించాడు. అయితే ఉదయాన్ని శ్రీనివాసులు హత్య విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


గురువారం ఈ హత్య జరగ్గా.. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసును వివిధ కోణాల్లో పరిశీలించిన పోలీసులు.. రెండ్రోజుల్లోనే హత్యకేసును ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ, డాగ్ స్క్వాడ్ ఆధారంగా శ్రీనివాసులును హత్యచేసింది రాజేష్ అని గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మార్కాపుర రోడ్‌లో తిరుగుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.

Latest News
Another Awami League leader dies in police custody in Bangladesh Mon, Dec 22, 2025, 02:36 PM
Cold wave conditions grip parts of Telangana Mon, Dec 22, 2025, 02:20 PM
Indian Army, NSUT join hands to develop AI-driven defence solutions Mon, Dec 22, 2025, 01:50 PM
'BJP emerging as credible alternative in TN; women seek safety, real empowerment': P Vijayalekshmi Mon, Dec 22, 2025, 01:49 PM
Nepal name 24-player group for training camp ahead of T20 WC Mon, Dec 22, 2025, 01:24 PM