by Suryaa Desk | Wed, Jun 26, 2024, 10:31 PM
ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత పన్ను సంస్కరణల వ్యతిరేకిస్తూ కెన్యా ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కెన్యా రాజధాని నైరోబిలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి.. బీభత్సం సృష్టించారు. ప్రాంగణంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను పగలుగొట్టి నిప్పంటించారు. పరిస్థితి అదుపుతప్పడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో పలువురు గాయపడగా.. కనీసం ఐదుగురు మృతి చెందినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది గాయపడినట్టు స్థానిక వైద్యులు తెలిపారు.
ఆందోళనకారులు పార్లమెంట్ లోపలికి చొచ్చుకుని రావడంతో ప్రజాప్రతినిధులు భయపడి అక్కడ నుంచి పరుగులు తీశారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్లు, భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. లాఠీఛార్జ్ను లెక్కచేయకుండా లోపలికి ప్రవేశించి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
పన్నుల సంస్కరణల పేరుతో బ్యాంకులో నగదు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, వంట నూనెలు, ఉద్యోగుల వేతనాలు, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ప్రజలపై మరింత పన్నులు భారం పడి, జీవనప్రమాణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించవద్దని కోరుతూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇవి క్రమంగా ఉద్ధృతమై పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ ఘటనలపై కెన్యా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఈ సంఘటనలను ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇది దేశద్రోహమని, అశాంతిని అణచివేస్తామని ఆయన ఉద్ఘాటించారు. పోలీసులకు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపినట్టు కెన్యా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు, మరోవైపు, పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కెన్యాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హై కమిషన్ హెచ్చరికలు చేసింది.
Latest News