by Suryaa Desk | Fri, Jun 28, 2024, 10:14 PM
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ- షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని కూటమి తాజాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ముంబైలోని విధాన్ భవన్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ నివాళులు అర్పించారు. అనంతరం సభలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అజిత్ పవార్.. తమ ప్రభుత్వం అందించనున్న పథకాలను వివరించారు. ఈ ఏడాది అక్టోబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందులో భాగంగానే 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. "ముఖ్యమంత్రి మాఝీ లడకీ బహిన్ యోజన" పేరుతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి అజిత్ పవార్ స్పష్టం చేశారు. జులై నెల నుంచే అర్హులైన మహిళల ఖాతాల్లో నెల నెలా రూ.1500 జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.46 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
అంతేకాకుండా మరో పథకాన్ని కూడా అజిత్ పవార్ ప్రకటించారు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇక మహారాష్ట్రలో పత్తి, సోయాబీన్ పండించే ప్రతీ రైతుకు ఒక హెక్టార్కు రూ.5 వేలు బోనస్గా చెల్లించనున్నట్లు ప్రకటించారు.
ఇక ఇదే బడ్జెట్లో పాల ఉత్పత్తిదారులకు కూడా మహా సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. జూలై 1 వ తేదీ నుంచి పాల ఉత్పత్తిదారులు పోసే పాలకు లీటర్కు రూ.5 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రూర జంతువుల దాడిలో చనిపోయిన వారికి గతంలో మహారాష్ట్రలో రూ.20 లక్షలు పరిహారం ప్రకటించేది. ఈ మొత్తాన్ని 25 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో అజిత్ పవార్ స్పష్టం చేశారు.
Latest News