by Suryaa Desk | Sat, Jun 29, 2024, 10:27 PM
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టెర్మినల్ 1 పైకప్పు కూలిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ పైకప్పు కింద ఉన్న క్యాబ్లో ఉన్న డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన ఆ క్యాబ్ డ్రైవర్ కథ వింటే కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్కు పెళ్లి వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కడే. ఇప్పుడు ఆయన కూడా అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇప్పుడు ఆ ఇద్దరి కుమార్తెల పెళ్లి ఎలా అని ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న విజయ్ విహార్కు చెందిన 45 ఏళ్ల రమేష్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్.. ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. టెర్మినల్ పైకప్పు కూలడంతో దానికింద కొన్ని కార్లు చిక్కుకుపోయాయి. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు.. పైకప్పు శిథిలాలను తొలగించి.. దానికింద నలిగిపోయిన కార్లను బయటికి తీశారు. అందులో ఓ క్యాబ్ డ్రైవర్ ఉండటం గమనించారు. అందులోనుంచి రమేష్ కుమార్ను బయటికి తీసుకువచ్చారు. భారీ ఇనుప రాడ్డు కారుపై పడటంతో రమేష్ అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు గుర్తించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న మేదాంత హాస్పిటల్కు తరలించారు.
ఈ ఘటన రమేష్ కుమార్ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. రమేష్ కుమార్కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రమేష్ కుమార్ కుమారుడు రవీంద్ర తెలిపాడు. తన తండ్రి సపోర్ట్ లేకుండా కుటుంబాన్ని ఎలా నడపాలి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అధికారుల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపాడు. అయితే తన తండ్రి చనిపోయాడు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదని పేర్కొన్నాడు.
వెంటనే తాము ఎయిర్పోర్టుకు వెళ్లామని.. పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు ఎదురుచూసినట్లు తెలిపారు. అప్పుడు వారు తమను ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడ 2, 3 గంటల పాటు వేచి ఉండాలని చెప్పారని.. ఆ తర్వాత మరుసటిరోజు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పినట్లు రవీంద్ర తెలిపాడు. మరికొన్ని రోజుల్లో తమ ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేయాలని తన తండ్రి ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఘోరం జరిగిపోయిందని.. ఇప్పుడు పెళ్లిళ్లు తమ కుటుంబం ఎలా చేయగలదని వాపోయాడు. ఎయిర్పోర్టులో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని.. తమకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Latest News