by Suryaa Desk | Sun, Jun 30, 2024, 08:37 PM
టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ బహుమతిని ప్రకటించింది. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్మనీని ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగి ఈ టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని భారత్ ప్రదర్శించిందని ఈ సందర్భంగా జైషా కొనియాడారు. ఈ అత్యుత్తమ విజయానికి కారణమైన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు.
కాగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఫలితంగా 11 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ కొనసాగిస్తున్న నిరీక్షణకు తెరదించింది. 150 కోట్ల మంది ప్రజల్లో సంతోషాన్ని నింపింది. ఈ విజయం పట్ల సంతోషంగా ఉన్న బీసీసీఐ.. ఈ మేరకు ఆటగాళ్ల కోసం భారీ ప్రైజ్మనీని ప్రకటించింది.
Latest News