by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:46 PM
పోలవరం ప్రాజెక్ట్లో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీపడండి.. గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయ్యేది. గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసింది. ఒక క్రమ పద్దతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్లు వైయస్ఆర్సీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి అని డిమాండ్ చేసారు.
Latest News