by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:42 PM
తాగునీటి కాలుష్యం, క్షీణించిన పారిశుధ్యం కారణంగా కడప జిల్లా, లక్కిరెడ్డి పల్లె మండల ప్రజలు 20 రోజులుగా డయేరియా బారిన పడి ఆస్పత్రులపాలవుతున్నారు. వైద్య సేవలు సరిగా అందక పోవడంతో ఆర్థికంగాను నష్టపోతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల వ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారింది. మండల కేంద్రంలోని రాయచోటి-వేంపల్లె మార్గంలోని ట్రాన్సపార్మర్ వద్ద కుప్పలు కుప్పలుగా చెత్త దర్శనమిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రైనేజి నీరు నిలిచిఉండడంతో, దోమలు పెరిగిపోయాయని స్థానికులు వాపోతున్నారు ఈ మురుగుగుంటల్లో వైద్యసిబ్బందిగా నీ పంచాయతీ అధికారులు కానీ పిడికెడు బ్లీచింగ్ పౌడర్గానీ, బైటాక్స్ కానీ చల్లిన పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. అనంతపురం, పందిళ్లపల్లె, మెయిన్ బజారుల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది గ్రామాల్లో పాలకవర్గాలు పారిశుధ్య చర్యలను పట్టించుకోక పోవడంతో బోర్లలోని నీరు కలుషితమై ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. లక్కిరెడ్డిపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లు న్నా మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండరు. ఆ తర్వాత వచ్చిన రోగులను సిబ్బంది కడపకు రెఫర్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అర్హతలు లేని ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యంపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు కనీసం సాయంత్రం వరకు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Latest News