![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:56 PM
ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా, ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు.2024 నవంబర్ 01న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం-2 పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. దీపం-2 పథకంతో ప్రతి పేద వాడి ఇంట్లో దీపపు కాంతులు విరాజిల్లుతున్నాయన్నారు. కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీపం-2 పథకం రూపొందించాయని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేయడం జరుగుతుంది.ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
Latest News