|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:19 PM
ఏపీ మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఆగస్ట్ 15 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్నారు. అయితే ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఏపీఎస్ఆర్టీసీకి త్వరలోనే వేయి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యుత్ శాఖపై మంగళవారం రోజు సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలో 5 వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించే క్రమంలో భాగంగా.. అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని.. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ అంశాలను పరిశీలించాలని సూచించారు. పీఎ కుసుమ్ సహా రూఫ్టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. మరో ఏడాది పాటు ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే బూడిదను ఇతర అవసరాలకు ఉపయోగించాలని సూచించారు.
మరోవైపు స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులలో కూడా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇప్పటికే వెల్లడించారు. సిటీ, పల్లెటూర్లకు తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే 1050 విద్యుత్ బస్సులు వస్తాయని.. వాటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తామని ఆర్టీసీ ఎండీ వివరించారు.
ప్రయాణికుల సౌకర్యం, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వీటిలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసే ప్రతి బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
Latest News