|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:33 PM
విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దుతో తలెత్తిన గందరగోళం, వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్కు వివరణ ఇచ్చారు. లోక్సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఇండిగో కార్యకలాపాలు వేగంగా సాధారణ స్థితికి వస్తున్నాయని, అయితే ఏ విమానయాన సంస్థకూ ప్రయాణికులకు కష్టాలు కలిగించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇండిగోపై చర్యలు తీసుకుంటున్నామని.. ఈ వ్యవహారంలో జవాబుదారీతనం తప్పక ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
డీజీసీఏ ఇప్పటికే ఇండిగో సీనియర్ నాయకత్వానికి కారణాలు కోరుతూ నోటీసులు జారీ చేసి, వివరణాత్మక దర్యాప్తును ప్రారంభించిందని తెలిపారు. దర్యాప్తు ఫలితం ఆధారంగా.. ఎయిర్క్రాఫ్ట్ రూల్స్, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. "ఏ విమానయాన సంస్థ కూడా, అది ఎంత పెద్దదైనా సరే.. ప్రణాళిక వైఫల్యాలు, చట్టపరమైన నిబంధనలను పాటించకపోవడం ద్వారా ప్రయాణికులకు ఇలాంటి కష్టాలను కలిగించడానికి అనుమతించబడదు" అని ఆయన అన్నారు. పౌర విమానయానంలో భద్రత పూర్తిగా రాజీ పడని అంశం అని నొక్కి చెప్పారు.
ఇండిగోలో తలెత్తిన సిబ్బంది సంక్షోభానికి ప్రధాన కారణమైన రివైజ్డ్ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ సంస్కరణలు.. పైలట్ల అలసటను నివారించడానికి శాస్త్రీయంగా రూపొందించబడినవని మంత్రి తెలిపారు. అయితే ఇండిగో ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తామని.. వింటర్ షెడ్యూల్కు తాము సిద్ధమని హామీ ఇచ్చినా ప్రాథమికంగా అంతర్గత రోస్టరింగ్ లోపాలు కారణంగా పెద్ద ఎత్తున విమానాలు రద్దై, వేలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రయాణికులు ప్రయోజనాలే ముఖ్య కేంద్రంగా ఉంటాయని అన్నారు.
ఆకస్మిక డిమాండ్లు, అధిక ధరల వల్ల ప్రయాణికులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఛార్జీలపై పరిమితి విధించాలని ప్రభుత్వం జోక్యం చేసుకుందని తెలిపారు. రీఫండ్లను తక్షణమే జారీ చేయాలని ఇండిగోను ఆదేశించగా.. ఆ సంస్థ వెంటనే రూ.750 కోట్ల రీఫండ్ను చెల్లించినట్లు మంత్రి తెలిపారు. పటిష్టమైన, మరింత పోటీతత్వంతో కూడిన విమానయాన వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. తమ విధానాల ద్వారా కొత్త విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని.. ఏకాధిపత్యానికి అవకాశం లేకుండా నివారించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.
Latest News