|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:53 PM
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరగనున్న కొద్ది రోజుల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో ఉన్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం గురించి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి 'డంప్' చేస్తున్నాయని రైతులు వాదిస్తున్నారు. ఈ చౌక దిగుమతులు అమెరికా ఉత్పత్తిదారులను, దేశీయ ధరలను దెబ్బతీస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా రైతుల కోసం 12 బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రారంభించేందుకు వైట్హౌస్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. "వారు (ఇతర దేశాలు) మోసం చేస్తున్నారు. మేము సుంకాల విధింపు మార్గాన్ని అనుసరించవచ్చు" అని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైస్మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ మాట్లాడుతూ.. తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో డంప్ చేస్తున్న దేశాల్లో భారత్, థాయ్లాండ్, చైనా ప్రధానంగా ఉన్నాయని ఆరోపించారు. చైనా వస్తువులు ప్యూర్టోరికోలోకి కూడా వెళ్తున్నాయని.. దీనివల్ల దక్షిణాది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అధ్యక్షుడు విధించిన సుంకాలు బాగా పని చేస్తున్నాయని.. అయితే వాటిని రెట్టింపు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. వివిధ దేశాలపై విధించిన సుంకాలను పెంచాలా అని అడిగారు. దీనికి వారు అవునని చెప్పగా.. ట్రంప్ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్ను ఆదేశించారు. ఈ జాబితాలో భారత్, థాయ్లాండ్, చైనాలు ముందు ఉన్నాయని.. వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఈ కీలక పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉంది. భారత్తో ట్రేడ్ డీల్కు సంబంధించిన చర్చలు ఈనెల 10 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్కు రానుంది. భారత్ తరఫున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పాల్గొంటారు. చర్చలు ప్రారంభానికి ముందు ట్రంప్ అదనపు సుంకాలను ఆలోచించడం గమనార్హం.
Latest News