|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 11:21 PM
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్కు సౌతాఫ్రికాతో తొలి టీ20లో నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అతడికి బదులుగా.. యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఓ దశలో భారత టీ20 జట్టులో ఓపెనర్గా స్థిరపడినట్లే కనిపించిన.. సంజూను తుది జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రోహిత్ శర్మ టీ20లకు గుడ్బై చెప్పిన తర్వాత ఆ ప్లేసులో సంజూ శాంసన్ బరిలోకి దిగాడు. ఓపెనర్గా మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్ 2026లోనూ అదే ప్లేసులో ఆడతాడని అంతా భావించారు. కానీ టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను.. ఆసియాకప్ 2025కి ముందు భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు. ఆ తర్వాత అతడిని ఓపెనర్గా ఆడిస్తున్నారు.
గిల్ రాకతో సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మిడిలార్డర్లోనూ సంజూను.. ఫిక్స్డ్ ప్లేసులో ఆడించలేదు. దీంతో అతడి బ్యాటింగ్లో నిలకడ లోపించింది. ఫలితంగా అతడి ప్రదర్శనను సాకుగా చూపి.. ఇప్పుడు ఏకంగా తుది జట్టు నుంచే తప్పించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫినిషర్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని చెబుతూ.. జితేశ్ శర్మను ప్రధాన వికెట్ కీపర్గా జట్టులోతీసుకుంటున్నారు.
ఇక సంజూ శాంసన్ ప్లేసులో ఓపెరన్గా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. ఒక్క మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు టీ20ల్లో భారత్ తరఫున ఓపెనర్గా సంజూ.. 17 ఇన్నింగ్స్ల్లో 995 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఓపెనర్గా వచ్చిన తర్వాత అభిషేక్ శర్మతో కలిసి సంజూ జట్టుకు శుభారంభాలు అందించాడని.. అలాంటి వాడిని హెడ్ కోచ్ గంభీర్ కావాలని టార్గెట్ చేశాడనే సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. గంభీర్ కుట్ర రాజకీయాలకు.. సంజూ టీ20 కెరీర్ నాశనం అవుతోందని కామెంట్లు చేస్తున్నారు.