ఇండిగో సంక్షోభంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు
 

by Suryaa Desk | Wed, Dec 10, 2025, 08:40 PM

ఇండిగో విమానయాన సంస్థలో వరుస విమానాల రద్దుతో నెలకొన్న సంక్షోభం, ప్రయాణికుల నుంచి ఇతర విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. విమాన ఛార్జీలు అకస్మాత్తుగా రూ. 40,000 వరకు పెరగడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది. ఒక సంస్థలో సంక్షోభం ఏర్పడితే.. ఇతర విమానయాన సంస్థలు దానిని ప్రయోజనంగా మార్చుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని సూటిగా నిలదీసింది. ముఖ్యంగా ఛార్జీలు రూ. 35,000 నుంచి రూ. 39,000 వరకు ఎలా పెరిగాయని అడిగింది.


ఇండిగో సంక్షోభం కారణంగా అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో విమాన ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. ముంబై-ఢిల్లీ మధ్య ఎకానమీ తరగతి వన్-వే టిక్కెట్ ధర రూ. 35,000 వరకు పెరిగింది. సాధారణంగా చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా డబుల్ ట్రిప్ రూ. 20,000 వరకు ఉంటుంది. కానీ ఇది అంతకుమించి ఉండగా.. వీటిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను కోర్టుకు సమర్పించగా.. "మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్‌లపై అధిక పనిభారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.


ఇదిలా ఉండగా.. ఇండిగో సంక్షోభంపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో వింటర్ షెడ్యూల్‌ను తగ్గించి, దాని కార్యకలాపాలను 5 శాతం తగ్గించింది. ఇండిగో రోజువారీ సుమారు 2,200 విమానాలను నడుపుతుండగా.. రోజుకు 110 విమానాలు తగ్గుతాయి. దీని కారణంగా ఖాళీ అయిన స్లాట్‌లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడానికి ఏ విమానయాన సంస్థను అనుమతించబోమని, భద్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్‌కు తెలిపారు. DGCA ఇండిగో సీనియర్ నాయకత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


ఇవన్నీ తెలుసుకున్న న్యాయస్థానం.. సంక్షోభం వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రయాణికులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.


Latest News
IANS Year Ender 2025: Inside India's final battle against Naxalism Sat, Dec 27, 2025, 04:29 PM
Very grateful, all credit to my team: Harmanpreet on becoming captain with most wins in women's T20Is Sat, Dec 27, 2025, 04:26 PM
Study finds risk-based approach better for breast cancer screening Sat, Dec 27, 2025, 04:24 PM
Rare earth manufacturing scheme to strengthen self-reliance for India's critical sectors Sat, Dec 27, 2025, 04:23 PM
Bangladesh: Tarique Rahman registers as voter, Awami League questions process Sat, Dec 27, 2025, 04:22 PM