|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:14 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో రాబోయే పర్వదినాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్, జనవరి నెలల్లో వచ్చే ముఖ్యమైన ఉత్సవాల రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దర్శన ప్రక్రియను సులభతరం చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, డిసెంబర్ 29న వైకుంఠ ఏకాదశికి ముందు రోజు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అలాగే జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు. అయితే, ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది.ఈ ప్రత్యేక రోజుల్లో బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చిచెప్పింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Latest News