|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:26 PM
విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే సాగరతీరం విశాఖలో మరో ప్రముఖ ఐటీ సంస్థ కొలువు దీరనుంది. కాపులుప్పాడలోని ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాగ్నిజెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు విశాఖపట్నం వేదికగా కాగ్నిజెంట్ సంస్థ తాత్కాలికంగా కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. అలాగే మరో 7 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను శంకుస్థాపన చేశారు.
చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్
టెక్ తమ్మిన
సత్వ డెవలపర్స్
ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్
ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్
మదర్శన్ టెక్నాలజీస్
క్వార్క్స్ టెక్నోసాఫ్ట్
ఏసీఎన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీసెస్
నానైల్ టెక్నాలజీస్
అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. అన్ని కంపెనీలు ప్రారంభమైతే యువతకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతున్నామన్నారు.విశాఖ నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని అన్నారు. భారతదేశంలో కాగ్నిజెంట్ సంస్థకు ఐదు కేంద్రాలు ఉన్నాయన్న చంద్రబాబు.. 2 లక్షల 41 వేల500 మంది భారత్ నుంచే కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని వివరించారు.
వీరిలో 80 శాతం మంది ఇండియన్సేనని వివరించారు. ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖలాంటి సుందరమైన నగరం ఎక్కడా లేదని.. త్వరలోనే విశాఖకు మెట్రో కూడా వస్తోందని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు వివరించారు.
విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం..
మరోవైపు విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమైంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమైంది.. రుషికొండ ఐటీ పార్కు, హిల్-2పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించారు. వేయిమంది సీటింగ్ సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు.
మరోవైపు కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటయ్యే వరకూ దీనిలో తాత్కాలికంగా కార్యకలాపాలు సాగిస్తారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాలలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1,583 కోట్లతో కాగ్నిజెంట్ సంస్థ దీనిని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. 2029 నాటికి మొదటిదశ, 2033 నాటికి మూడు దశలను పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు.